Moviesనంద‌మూరి హ‌రికృష్ణ‌ను వెండితెర స్టార్‌ను చేసింది ఆ ఒక్క‌డే...!

నంద‌మూరి హ‌రికృష్ణ‌ను వెండితెర స్టార్‌ను చేసింది ఆ ఒక్క‌డే…!

దివంగత నటరత్న ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ నటుడిగా కథానాయకుడిగా తెరపై కనిపించింది తక్కువ. తెలుగు తెర‌పై తొలి నటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా హరికృష్ణ చేసింది తక్కువ సినిమాలే..! అయినా ఆ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ పాత్రలలో తన మార్కు చూపించారు హరికృష్ణ. ఆయ‌న నట ప్రయాణం పదేళ్ల వయసు నుంచే ప్రారంభమైంది. తండ్రి ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన శ్రీకృష్ణ అవతారం సినిమాలో హరికృష్ణ బాల నటుడుగా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తల్లా పెళ్ళామా – తాతమ్మకల సినిమాల్లోనూ బాలనటుడిగా కనిపించారు.

ఆ తర్వాత రామ్ రహీం – దానవీరశూరకర్ణ సినిమాలు చేశారు. ఇక నిజజీవితంలో అన్నదమ్ములైన హరికృష్ణ – బాలకృష్ణ తాతమ్మకల సినిమాలో అన్నదమ్ములుగా కనిపించారు. అందులో బాలకృష్ణ తమ్ముడుగా, హరికృష్ణ అన్నయ్యగా కనిపించారు. ఆ తర్వాత రామ్ రహీం సినిమాలో స్నేహితులుగా కనిపించారు. అప్పటినుంచి హరికృష్ణ సినిమాలకు దూరమైపోయారు. తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు పూర్తి స‌మ‌యం ఆయనవెంటే ఉండిపోయారు. తండ్రి అధికారంలో ఉన్న‌ప్పుడు ఏనాడు ఆయ‌న ప‌ద‌వులు తీసుకోలేదు. తండ్రి మ‌ర‌ణాంత‌రం 1996లో కొద్దిరోజులపాటు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన హరికృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు.

20 ఏళ్ల విరామం తర్వాత నందమూరి కుటుంబం అభిమానిగా ఉన్న వైవిఎస్.చౌదరి దర్శకత్వం వహించిన సీతారామరాజు సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునకు అన్నయ్యగా నటించారు. ఈ సినిమాలో హరికృష్ణ – నాగార్జున అన్నదమ్ములుగా కనిపించారు. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా ఎన్‌. శంకర్ దర్శకత్వంలో వచ్చిన శ్రీరాములయ్య సినిమాలో కామ్రేడ్‌ సత్యం అనే గెస్ట్ పాత్రలో నటించారు. ఆ రెండు సినిమాలు హరికృష్ణకు మంచి పేరు తీసుకురావడంతో కొద్దిరోజులపాటు వరుస సినిమాలు చేశారు.

ఆ తర్వాత అదే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హరికృష్ణ ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అదే చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతయ్య సినిమాతో హరికృష్ణకు తిరిగిలేని స్టార్‌డం వచ్చింది. మాస్ హీరోగాను హరికృష్ణ అలరించారు. 20 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న హరికృష్ణ రీఎంట్రీ ఇచ్చాక ఒక్క వైవిఎస్ చౌదరి దర్శ‌క‌త్వంలోనే ఏకంగా మూడు సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు హరికృష్ణను ఐదు పదుల వయసులో తిరుగులేని హీరోగా నిలబెట్టాయి.

హరికృష్ణకు ఆ వయసులో అంత గొప్ప స్టార్‌డం రావడం వెనక ఆ క్రెడిట్ కచ్చితంగా వైవిఎస్ చౌదరికే దక్కుతుంది. సీతయ్య తర్వాత టైగర్ హరిచంద్ర ప్రసాద్ – స్వామి – శ్రావణమాసం సినిమాల్లో నటించారు. నటుడుగా తన చివరి సినిమాలో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించారు. ఆ తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. ఇక హరికృష్ణ ఇద్దరు కుమారులు ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఇద్దరూ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇటీవల ఇద్దరు త్రిబుల్ ఆర్‌, బింబిసార‌ సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news