తెలుగు సినీ రంగంలో చిరస్థాయిగా ముద్ర వేసిన అన్నగారు ఎన్టీఆర్.. 24 కళల్లోనూ ఆరితేరారు. ఇది నాది కాదు.. అది నాది కాదు.. అనే మాటే ఆయన దగ్గర వినిపించేది కాదు. సాధారణంగా.. దర్శకత్వం… సంగీ తం.. నిర్మాత.. వంటి విషయాలను వదిలేస్తే.. కాస్ట్యూమ్స్ దగ్గరకు వచ్చేసరికి హీరోలు జోక్యం చేసుకోరు. దీనిపై పూర్తి ఆధిపత్య కథా రచయిత, దర్శకుడు చూసుకుంటారు. అయితే.. అన్నగారు నర్తన శాల సినిమాలో బృహన్నల వేషం వేసినప్పుడు.. తనే స్వయంగా డిజైన్ చేయించుకున్నారట.

ఇక ఆయన దర్శకుడు కూడా అయిన విషయం తెలిసిందే. నిర్మాతగా.. కూడా రాణించారు. కానీ, కలం పట్టడం చాలా అరుదు. కథను టూకీగా రచయితకు చెప్పేవారు. ఆయన తర్వాత పర్యవేక్షించేవారు. కానీ, తల్లా పెళ్లామా సినిమా విషయంలో మాత్రం అన్నగారు రాజీ పడలేక పోయారు. ఇద్దరు రచయితలకు ఔట్ లైన్ చెప్పి కథరాయించినా.. ఆయన సాటిస్ఫై కాలేదు. దీంతోస్వయంగా ఆయనే కథరాసుకున్నారు. 1970లో వచ్చిన ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది.

అదేసమయంలో జై ఆంధ్ర ఉద్యమం జరుగుతోంది. ప్రాంతాల వారీగా తెలుగు వారి విడిపోవాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇక, మరోవైపు.. అన్నగారు బిజీగా ఉన్నారు. అయినప్పటికీ.. ఈ సినిమాను సినిమా గా కాకుండా.. ఒక సందేశంగా విడుదల చేయాలని నిర్ణయించుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చాక.. నిద్ర మానుకుని మరీ ఈ కథను రెడీ చేసుకున్నారు. ఈ సినిమాలో పాటలు నారాయణరెడ్డిగారు రాశారు. అన్నగారెంత శ్రద్ధగా కథ సిద్ధం చేసుకున్నారో.. అంతే శ్రద్ధగా ఆయన పాటలు కూర్చారు.

తెలంగాణా ప్రాంతంలో 1969లో ప్రత్యేక తెలంగాణా కోసం జై తెలంగాణ ఉద్యమం జరగగా, 1970లో ఆంధ్ర ప్రాంతంలోనూ విభజన కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఈ రెండు ఉద్యమాలూ ఆంధ్రప్రదేశ్ విభజన కోరుకోగా, దీన్ని వ్యతిరేకిస్తూ సమైక్యతకు మద్దతుగా సినిమాలో పాటను పెట్టారు. తెలుగు వారు సమైక్యంగా ఉండాలని ఉద్బోధిస్తూ సాగే “తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది” పాటను సి.నారాయణరెడ్డి రాస్తే, సినిమాలో సన్నివేశాన్ని కల్పించి మరీ ఎన్టీఆర్ చిత్రీకరించారు. ఇదీ.. అన్నగారి దీక్ష!!