ఏపీ, తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లే అని ఓ పక్క ఎగ్జిబిటర్స్ చెబుతుంటే… మరో పక్క డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. అద్దె పద్దతిలో కాకుండా పర్సేంటేజ్ సిస్టమ్లో అయితేనే తాము సినిమాలు తమ థియేటర్లలో ఆడిస్తాం లేకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తాం అని ఇప్పటికే ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు. అయితే బుధవారం విడివిడిగా జరిగిన సమావేశంలో ఎవ్వరూ ఎటూ తేల్చుకోలేకపోయారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి ఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ మూడు సెక్టార్స్ నుండి కొందరిని ఎంపిక చేసి… ఓ కమిటీని వేసింది. ఈ జాయింట్ కమిటీ మీటింగ్ మే 24, శనివారం జరుగబోతోందట. ఉదయం నుండి సాయంత్రం వరకూ రెంటల్, పర్సంటేజ్ లో సినిమాలను ఆడితే వచ్చే కష్టనష్టాల గురించి చర్చించాక వీరు ఓ నిర్ణయానికి వస్తారట. ఎగ్జిబిటర్స్ కోరినట్టుగా పర్సంటేజ్ సిస్టమ్ కు నిర్మాతలు, పంపిణీ దారులు అంగీకరిస్తే ఓకే.. లేకపోతే మళ్లీ ఇది ఎటు వెళుతుందో ? చూడాలి.
జూన్ 5న కమల్ హాసన్, మణిరత్నం పాన్ ఇండియా మూవీ ‘థగ్ లైఫ్’, 12న పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’ విడుదల కాబోతున్న నేపథ్యంలో వాతావరణం కాస్తంత వేడెక్కింది. ఈ రెండు పెద్ద సినిమాల ప్రదర్శనకు ఆటంకం కలగకుండా చేయాలని అందరూ చూస్తున్నారు. ఏదేమైనా ఎగ్జిబిటర్లు మాత్రం ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదని.. ఈ సారి తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయంతో ఉన్నారు.