ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులను దగా చేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తాజాగా రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ జగన్తో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని రైతుల అధికారాలను ప్రభుత్వమే కాలరాస్తోందని మండిపడ్డ ఆయన ప్రభుత్వం చేసిన చట్టసవరణతో రైతలకు దక్కేది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు.
ఇక రాష్ట్ర విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని స్పష్టంగా ఉందని.. ఇప్పటికే రాజధాని కోసం కేంద్రం రు. 1500 కోట్లు ఇచ్చిన విషయం కూడా ఆయన గుర్తు చేశారు. అమరావతి పరిరక్షణకు మహిళలే ముందు ఉండి పోరాడాలి అన్న ఆయన ప్రజా ప్రతినిధులకు రాజీనామాల కంటే రాజీలేని పోరాటమే సరైంది అని సూచించారు. ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్ఫూర్తితో అమరావతి ప్రజలు ఉద్యమించాలని.. ఎన్నికల ముందు జగన్ ఓదార్పు పేరుతో ఇంటింటికి వెళ్లారని.. నాడు ఆత్మహత్య చేసుకున్న రాజధాని రైతుల కుటుంబాలను పరామర్శించిన ఆయన ఇప్పుడు అక్కడ రాజధాని మార్పుతో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమని సమాధానం చెపుతారని ప్రశ్నించారు.
జగన్ ఇతర ప్రాంతాల ప్రజల కన్నీళ్లు తుడవడానికే జగన్ మూడు రాజధానులు చేసి దానికి అభివృద్ధి వికేంద్రీకరణ అన్న అందమైన పేరు పెట్టారని..వైసీపీ సర్కార్ తీసుకు వచ్చిన ఏఎంఆర్డీసీయే చెల్లదని కూడా ఆయన అన్నారు. ఏదేమైనా రాజధాని వికేంద్రీకరణపై పలు ప్రశ్నలు సంధించిన రఘురామ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. మరి దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి రిప్లై ఉంటుందో ? చూడాలి.