Movies‘రీఎంట్రీ కోసం‘కత్తి’ స్టోరీని అందుకే ఎంచుకున్నా’.. చిరు చెప్పిన షాకింగ్ విషయాలు

‘రీఎంట్రీ కోసం‘కత్తి’ స్టోరీని అందుకే ఎంచుకున్నా’.. చిరు చెప్పిన షాకింగ్ విషయాలు

Megastar Chiranjeevi reveals more interesting topics about his 150th movie Khaidi No 150 in his latest interview.

ప్రస్తుతం సినీపరిశ్రమలో పోటీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ స్థానం పదిలపరచుకోవడం కోసం చిన్నోళ్ల దగ్గరనుంచి స్టార్ హీరోల దాకా తెగ పోటీపడుతున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. స్టార్ హీరోల మధ్య ఈ పోటీ మరీ తీవ్రంగా ఉంది. దీంతో.. తమ గుర్తింపును కాపాడుకోవడం కోసం వీరికి పెద్ద సవాల్ అయ్యింది. కానీ చిరంజీవి విషయానికొస్తే.. తొమ్మిదేళ్లపాటు సినిమాలు చేయకపోయినా, ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆయనపై ఉన్న అభిమానం ఇంతైనా తగ్గకపోగా మరింత పెరిగింది. ‘మెగాస్టార్’ స్థానాన్ని ఎవరూ అధీష్టించలేరని ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ కాకముందే నిరూపితమైంది. ఇప్పటివరకు ఆ మూవీ సృష్టించిన రికార్డులే సాక్ష్యం. ఇక అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియెన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. జనవరి 11వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా.. చిరు కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మీడియాతో పంచుకున్నారు.

తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ‘ఖైదీ’ కోసం సెట్‌లోకి అడుగుపెట్టిన అనుభూతి గురించి చిరు మాట్లాడుతూ.. ‘ఆ గ్యాప్‌లో నేను సినిమాల్లో నటించపోయినా.. పరిశ్రమకి మాత్రం దూరం కాలేదు. అయితే.. ‘ఖైదీ’ కోసం మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం నాలో ఒక కొత్త రకమైన అనుభూతి కలిగింది. వాతావరణం కొత్తగా అనిపించలేదు కానీ.. సాంకేతికత, సినిమాని తీసే విధానంలో మార్పులు కనిపించాయి. అప్పట్లో ఫిల్మ్‌ ఉండేది, క్లాప్‌ ఉండేది కానీ.. అవేవీ ఇప్పుడు లేవు. మొత్తం డిజిటలైజ్‌ అయింది. సెట్‌లోకి అడుగుపెట్టిన తొలిక్షణాల్లో.. ఇది కదా మన సామ్రాజ్యం అనిపించింది’ అని అన్నారు. ఇదే సమయంలో రీఎంట్రీ కోసం ‘కత్తి’నే ఎందుకు ఎంచుకున్నారన్న దానిపై కూడా చిరు క్లారిటీ ఇచ్చారు. ‘అంచనాలకి దీటుగా కథని ఎంచుకోవాలని దాదాపు ఒక సంవత్సరంపాటు ఎన్నో కథలు విన్నాను. ఆ టైంలోని తమిళ చిత్రం ‘కత్తి’ని చూశా. అందులో.. బలమైన సామాజిక సందేశంతోపాటు, కమర్షియల్‌ హంగులు కనిపించాయి. అప్పుడు.. రీఎంట్రీకి అది సరైందని భావించి.. ఆ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ చిత్రం ‘ఠాగూర్‌’ స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చారు.

ఇంకా చిరు మాట్లాడుతూ.. ‘కత్తి’లో రాజకీయాంశాలు ఎక్కువగా ఉంటాయి కానీ, ‘ఖైదీ’లో మాత్రం కార్పొరేట్‌ విధానాల నేపథ్యం ఉంటుంది. తమిళంతో పోలిస్తే ఖైదీ సినిమా మరింత వేగంగా సాగుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం తాను నాజుగ్గా మారడానికి చాలా కసరత్తు చేశానని, ఆ విషయంలో రామ్‌చరణ్‌నే అభినందించాల్సిందేనని చెప్పారు. తన ఫిట్‌నెస్‌, డైట్‌కి సంబంధించిన వ్యవహారాలు కూడా తనే చూసుకొన్నాడని.. అందుకే తొమ్మిది కిలోల బరువు తగ్గానని చిరు వెల్లడించారు. ఈ మూవీ తర్వాత మరో రెండు మూవీలు లైన్‌లో ఉన్నాయని, ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నానని మెగాస్టార్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news